
Thursday, July 2, 2009
Saturday, June 27, 2009
1948లో పశ్చిమ పంజాబ్ నుంచి తూర్పు పంజాబ్ తరలి వచ్చిన రైతు శరణార్ధుల పునరావాశం
[దేశ విభజన తరువాత] పశ్చిమ పంజాబ్ [పాకిస్థాన్] లో హిందువులు, సిక్కులు వదిలి వచ్చినది [సాగుభూమి] 2.7 మిలియన్ల హెక్టార్లు కాగా, తూర్పు పంజాబ్ [భారతదేశం] లో ముస్లింలు వదలి వెళ్ళినది 1.9 మిలియన్ల హెక్టార్లు మాత్రమే. పశ్చిమ ప్రాంతలో నేల చాలా సారవంతమైనదీ, సమృద్ధిగల నీటి పారుదల వున్నదీ కావడం ఈ కొరత తీవ్రతని అధికం చేసింది. [...]
మొదటిగా ప్రతి శరణార్ధి కుటుంబానికి - పాకిస్తాన్ లో వాళ్ళ వాటా ఎంతా అన్న ప్రశ్న లేకుండా – నాలుగు హెక్టార్లు కేటాయించడం జరిగింది. విత్తులు, పరికరాలు కొనుగోలుకోసం ముందస్తుగా రుణాలు జారీ అయ్యాయి. తాత్కాలికంగా యిచ్చిన భూభాగంలో సాగుపనులు జరుగుతున్నప్పుడే, శాశ్వతమైన కేటాయింపులకై దరఖాస్తులుకోసం పిలుపు యిచ్చారు. ప్రతి కుటుంబాన్ని. తాము ఎంత భూమి వదిలి వచ్చేరో ఆధారాలు సమర్పించవలసిందని కోరారు. 10 మార్చి 1948 నుంచి దరఖాస్తులు స్వీకరించడం మొదలు పెట్టారు; ఒక నెల రోజుల లోపే 500,000 వాజ్యా (claim)లు దాఖలయ్యాయి. తరవాత, అదే గ్రామం నుంచి వచ్చిన శరణార్ధులు వున్న బహిరంగ కూటమిలలో ప్రతి వాజ్యాన్ని సరిచూడడం జరిగింది. ఒక ప్రభుత్వ అధికారి ప్రతి వాజ్యాన్ని పైకి చదువగా, కూటమి దాన్ని అంగీకరించడమో, మార్చడమో లేక నిరాకరించడమో చేసేది.
అనుకున్నట్టుగానే చాలామంది శరణార్ధులు [వదిలి వచ్చిన దాన్ని] కొంత ఎక్కువ చేసి చెప్పడానికి ఉద్యుక్తులయ్యారు. అయితే, ప్రతి తప్పు వాజ్యం శిక్షించబడిది – ఆ శిక్ష కొన్నిసార్లు కేయించిన భూమిని తగ్గించడం, కొన్ని తీవ్రమైన సంఘటనలలో స్వల్ప ఖైదు. దీని వల్ల చాలా వరకూ నిరోధన జరిగినా; ఈ మొత్తం వ్యవహారంలో సన్నిహితంగా పాలుపంచుకున్న ఒక అధికారి అంచనా ప్రకారం మొత్తం మీద 25% పెంచి చెప్పడం జరిగింది. వాజ్యాలని పోగుజేయడానికి, సంప్రదించడానికి, సరిచూడడానికి, చర్య తీసుకోవాడానికి గాను ఒక పునరావాశ సచివాలయం జలంధర్ లో ఏర్పాటు అయ్యింది. అది ఉచ్ఛస్థాయిలో వున్నరోజుల్లో అక్కడ 7000 మంది అధికారులు పనిచేశేవారు. ఒక మాదిరి శరణార్ధుల నగరాన్ని వారంతట వారే స్థాపించారు. చాలామంది అధికారులు డేరాల్లో సర్దుకున్నారు. నాసిరకమైన దీపాలు, లంతర్లలో తాత్కలికంగా హిందువులకోసం ప్రార్ధానాస్థలాలు, గుళ్ళూ, సిక్కుల కోసం గురుద్వారాలతో పనిచేశారు.
ఈ కార్య నిర్వహణకి నేతృత్వం పునరావాసం డైరక్టర్ జెనరల్, భారతీయ సివిల్ సర్వీసస్ అధికారి, సర్దార్ తారాలోక్ సింగ్. వీరు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ పట్టభద్రులు. శరణార్ధుల స్థిరనివాసం విజయవంతం అవడానికి కీలకమైనవని రుజువైన రెండు కొత్త కల్పనలు చేయడానికి తారాలోక్ సింగ్ తన విద్యా శిక్షణని సమర్ధవంతగా వినియోగించారు. ఆ రెండూ ‘ప్రామాణికమైన ఎకరం’ (standard acre), ‘శ్రేణికి తగ్గ కోత’ (graded cut) అన్నవి.
పదినుంచి పదకొండు మాండుల (దాదాపు 40 కిలోలు ఒక మాండు) దిగుమతి యివ్వడానికి ఎంత భూమి అవసరమో దాన్ని ప్రామాణికమైన ఎకరంగా నిర్వచించారు. సాగు సౌకర్యంలేని, బీడు భూమి గల తూర్పు జిల్లాల్లో నాలుగు భౌతికమైన ఎకరాలు ఒక ప్రామాణికమైన ఎకరంతో సమానం. కోమలమైన ‘కాలువ ప్రాంతాల’లో ఒక భౌతిక ఎకరం ఒక ప్రామాణికమైన ఎకరంతో సమానం. ప్రామాణిక ఎకరం అనే భావనతో పరగణాల్లో వున్న నేల, వాతావరణం వంటి వ్యత్యాసాల ప్రభావానికి పరిష్కారం జరిగింది.
మరోవైపు, శ్రేణికి తగ్గ కోత అన్న భావన శరణార్ధులు వదిలి వచ్చిన భూమికి, వారికి లభిస్తున్న భూమికి వున్న లోటు – దాదాపు మిలియన్ ఎకరాల లోటు – ని అధిగమించడానికి ఉపయోగపడింది. మొదటి 10 ఎకరాల వాజ్యానికి 25% శాతం కోత విధించబడింది – దానితో వారికి 10 ఎకరాల బదులు 7.5 ఎకరాలు లభించింది. ఎక్కవ వాజ్యాలకి కోత ఎక్కువ; 10 నుంచి 30 ఎకరాలకి కోత 30% అలా పెంచి 500 ఎకరాల కన్న ఎక్కువ వున్న వారికి 95% సుంకం విధించారు. వ్యక్తిగతంగా అందరికన్న ఎక్కువ కోల్పోయిన ఒక వ్యక్తి విద్యావతి అని పేరు గల స్త్రీ. ఆమె వారసత్వంగా భర్తనుంచి పొందిన, (తరువాత పోగొట్టుకున్న) 11,500 ఎకరాల సంస్థానం గుజరన్ వాలా, సైల్ కోట్ జిల్లాలలో ముఫైఐదు గ్రామాల వరకూ విస్తరణగలది. దానికి ప్రతిఫలంగా ఆమెకి కేటాయించబడింది కర్నాల్ అనే ఓకే గ్రామంలో వున్న అతికొద్ది 835 ఎకరాలే.
1949 నవంబరు నాటికి తారాలోక్ సింగూ ఆయన అధికారులూ 250,000 భూమి కేటాయింపులు చేసారు. ఈ శరణార్ధులందరూ న్యాయబద్ధంగా మొత్తం తూర్పు పంజాబు జిల్లాలోకి తరలించబడ్డారు. మొత్తం గ్రామ సముదాయాలని పున: సృష్టించడం అసాధ్యమని రుజువైనా పూర్వపు యిరుగుపొరుగులూ, కుటుంబాలూ ఒకేచోట మళ్ళీ స్థిరపడ్డారు. శరణార్ధులకి వారికి లభించిన కేటాయింపుల పట్ల నిరసన వ్యక్తం చేయడానికి అవకాశం యిచ్చారు. దాదాపు 100,000 కుటుంబాలు పున: సమీక్ష కోరాయి. అందులో మూడోవంతు అభ్యంతరాల మీద చర్య తీసుకున్నారు, దాని ఫలితంగా 80,000 హెక్టార్లు చేతులు మారాయి.
పడమరలో మంచి నీటి సదుపాయం వున్న తమ భూములకి బదులుగా ఈ శరణార్ధులకి తూర్పులోని వట్టిపోయిన ఆస్తులు యిచ్చారు. శ్రేణికి తగ్గ కోత వల్ల వాళ్ళకి పోగొట్టుకున్నదానికన్నా తక్కువే దొరికింది. అయినా, వారికి స్వభావసిద్ధమైన చాతుర్యం, పరిశ్రమ వల్ల వారు పనిలో దిగారు, కొత్త నూతులు తవ్వారు, కొత్త యిళ్ళు కట్టారు, పంటలు నాటారు. నిర్జీవమైన గ్రామసీమల్లో 1950 నాటికి మళ్ళీ జీవం వచ్చింది.
[ఆంధ్రా సెజ్ విషయంలో రైతుల భూమికి పరిహారంగా నగదు యిచ్చి ప్రభుత్వాలు చేతుల కడుక్కోగలగడానికి కారణం దేశంలో 40, 50 దశాబ్దాలలో వున్న ఆదర్శాలు యిప్పుడు లేకపోవడమా? (అను.)]
[Excerpt from ‘India After Gandhi’ - Rama Chandra Guha, (First Harper Perennial edition published 2008). Pages 99 and 100]
Sunday, May 17, 2009
ఎన్నికల ఫలితాలు
ఈ ఎన్నికల ఫలితంగా రాష్ర్టంలో మొదటి సారిగా హంగ్ ఏర్పడే అవకాశం, దేశంలో అద్వాని ప్రధాని అయ్యే అవకాశం వుందన్న అంచలనాని తలక్రిందలు చేస్తూ కేంద్రంలోను, రాష్ట్రంలోను కాంగ్రెస్ స్వంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే స్థితిలో వుండడం అద్వాని అభిమానులకూ, అలాగే, తెలంగాణా వాదులకూ మింగలేని పరిణామం. ఓట్ల లెక్కింపుకు ముందు ఛాట్ లో ఓ తెలంగాణా వాదిని ‘ఫలితాలు ఎలా వుంటాయని నీ అంచనా’ అంటే, అతను ‘కేంద్రంలో బి.జె.పి రావాలే’ అని కోరిక వెలిబుచ్చాడు. కేంద్రంలో బి.జె.పి అధికారంలో వస్తే తెలంగాణా వంద రోజుల్లో యిచ్చేస్తారని నమ్మినా, అద్వాని, మోడీల నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పడితే మాంద్యం నేపథ్యంలో బి.జె.పి - కాలం చెల్లిన - నియో లిబరల్ ఆర్ధిక విధానాల వల్ల దేశానికి ఎంత నష్టమో అన్న భయం కానీ, టెర్రరిజం బూచి పేరుతో మైనారటీల మీద ఎలాంటి నిర్బంధాలు జరుగుతాయో అన్న ఆందోళన కానీ టి.ఆర్.ఎస్ ని, తెలంగాణా వాదులని బి.జె.పి పంచన చేరకుండా ఆపలేకపోయాయి. ప్రత్యేక రాష్ట్రం కోసం అవసరమైనది ఏమైనా చేస్తామన్న దృష్టితో సాగుతున్న పరిమిత ఆచరణకనుక దీన్ని ‘తెలంగాణా వాద’ మనే అనాలి కాని ఉద్యమం అనలేం. నావరకైతే చాలా ఆనందం కలిగించిన ఫలితాలు, ఒకటి, టి.ఆర్.ఎస్. ఘోరపరాజయం, రెండు, అద్వాని రాజకీయ జీవితానికి దాదాపు ఆఖరి ఎన్నికలాంటి ఎన్నికలో బి.జె.పి. ఓటమి, మూడు అల్లు అరవింద్ మట్టి కరవడం.
ఈ ఎన్నికలలో ఎన్నడూ లేనంతగా ఓటింగ్ జరిగింది. ఓటర్లలో చాలామంది వయసు ముఫైలలోపు. మళ్ళీ ఐదు సంవత్సరాలలోపు ఎన్నికలు జరిగే అవకాశం లేని విధంగా ప్రజలు తీర్పు యిచ్చారు. ఓడించిన వాళ్ళు ఎందుకు ఓడిపోయారో అర్ధం అవుతున్నంత స్పష్టంగా గెలిచిన వాళ్ళు ఎందుకు గెలిచారో తెలియడం లేదు. రాష్టంలో ప్రజలు కాంగ్రెస్ ని తిరిగి ఎన్నుకున్నారంటే ‘రాజశేఖరుడి మీద మోజు తీర’కా? లేక బరిలో ఉన్న యితరుల కన్నా ఆయనకే ఎక్కువ విశ్వసనీయత వుందని భావించారా? లేక అంత కన్నా యోగ్యత వున్న యితర పార్టీల వారికి – ప్ర.రా.పా, లోక్ సత్తా – యింకా సరైన నిర్మాణం లేకనా? ప్ర.రా.ప. మీద ప్రజలకి గణనీయమైన విశ్వాసం లేదనడానికి చిరంజీవి ఓటమి, అల్లు అరవింద ఓటమి సాక్ష్యంగా చూపచ్చు. లోక్ సత్తా జయప్రకాష్ గెలవడం చాలా సంతోషమైన విషయం. రామచంద్ర గుహ అవుట్ లుక్ లో ఎన్నికల గురించి రాసిన వ్యాసంలో భవిష్యత్తు ఎన్నికలలో నిర్ణయాత్మక శక్తిగా లోక్ సత్తాలంటి పార్టీలు రూపుదిద్దుకుంటాయని చెప్పిన జోస్యం సరైనదనడానికి యిది ఒక సూచనగా తీసుకోవచ్చు.
చిరంజీవి పార్టీ పెట్టినప్పటినుంచి ఎన్.టి.ఆర్. లాగా మొదటి ఎన్నికలలోనే అధికారం సంపాదిస్తామని ధీమాగా చెప్పారు. తరువాత జరిగిన పరిణామాలు ఆ నమ్మకం కలిగించలేదు. వ్యక్తిగతంగా చిరంజీవి ఎన్.టి.ఆర్. లాంటి వక్తకాకపోవడం, ప్ర.రా.పకి సొంత పేపరు, ఛానల్ లేకపోవడం మాత్రమే వారి భంగపాటుకి కారణమని నేను భావించను. ఎన్.టి.ఆర్. విజయానికి కారణమైన బలమైన చారిత్రక శక్తి, జస్టిస్ పార్టీలాంటి బ్రాహ్మణ వ్యతిరేక, రాజకీయ సాంఘిక ఉద్యమాలలో పనిచేసిన అప్పటి పురోగామి కమ్మ కులస్తుల సంఘటిత ఆకాంక్ష. దానికి తగ్గ ముఖచిత్ర ప్రతినిధిగా ఎన్.టి.ఆర్. ముందుకు రావడం వల్లనే ఆయన విజయం సునాయాసం అయింది తప్ప దాన్ని వ్యక్తి విజయంగానో దీన్ని వ్యక్తి పరాజయంగానో భావించడం పొరపాటు. భవిష్యత్తులో, వెనకబడ్డ వర్గాల రాజకీయ ప్రతినిధిగా ప్ర.రా.ప. విశ్వసనీయత సాధించ గలిగే అవకాశం ఎంత? వచ్చే ఎన్నికలవరకు ప్రరాప మనగలుగుతుందా అన్నదే ప్రస్తుత పరిస్థితుల్లో అస్పష్టంగా వుంది.
కె.సి.ఆర్. ఎన్నికల ఫలితాల తరువాత చేసిన క్లుప్తమైన ప్రసంగంలో ‘పోరాటం కొనసాగుతుంది’ అని చెప్పారు. తె.రా.స. ఓటమికి మాత్రమే కాక, కూటమి ఓటమికి కూడా కె.సి.ఆర్.కొంత కారణమని కూటమి నేతలు చెప్పిన విషయం సత్యదూరం కాదు. ఆయన నాయకుడిగా కొనసాగినంతకాలం పార్టీకి కానీ, ఆయన పోరాటంగా పేర్కుంటున్న వాదానికి కానీ విశ్వసనీయత పెరిగే అవకాశం లేదు. ఈ వాదానికి బలం చేకుర్చదలుచుకుంటే, అధ్యక్ష పదవికి – నిజంగా - రాజీనామ చేసి, మేనల్లుడినో, కోడుకునో మరో డమ్మీనో ఆస్థానంలో కూర్చోపెట్టక, యింటా బయట విశ్వసనీయత వున్న జయశంకర్ లాంటి ఉద్యమనేపథ్యం వున్న వ్యక్తికి పార్టి పగ్గాలు యివ్వడం ఉత్తమం. చాలామంది తెలంగాణా వాదులు, ముఖ్యంగా దేశం బయట వుండి తెలంగాణా కోసం తాపత్రయపడుతున్నామనుకునే వాళ్ళు, ఆయన వైఖరి లక్ష్యానికి ఆటంకం కలిగిస్తోందా లేదా అన్నది పక్కన పెట్టి, వాళ్ళు చేయలేని పని – ఆంధ్రావాళ్ళని బూతులు తిట్టడం – ఈయన చేయడం వల్ల చాలా ఆనందం పొందుతుండచ్చు. సంయమనంతో వాదం చేయగల వ్యక్తులు, ముఖ్యంగా రెండు రాష్ట్రాలుగా విడిపోవాలంటే దానికి అవసరమైన ఆర్ధికమైన (రెవెన్యూ, బడ్జట్) సర్దుబాట్లు విషయాలగురించి ఆలోచించగలిగే వ్యక్తులు రంగం మీదకి రాకుండా, ఈ పార్టీ మనుగడే ప్రశ్నార్ధకం.
రాష్ట్రంలో కాంగ్రెస్ కి కొంతైనా బయట సహాయం అవసరమైన బలహీన స్థితిలో ఉండి వుంటే బాగుండేది. యింకో ఐదు సంవత్సరాలు ఎవరూ అడ్డుకోలేరనే ధైర్యం వచ్చాకా, కేంద్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వమే వుండడంతో, నక్సలైట్ల విషయంలో, నిబంధనల విషయంలో, తెలంగాణా విషయంలో రాజశేఖర రెడ్డి ఏకపక్షంగా ఎలాంటి నిర్ణయాలైన తీసుకోగలరు. ఆయన రాజకీయ ప్రత్యర్ధుల్ని ఎలాంటి అగచాట్లకైనా గురిచేయగలరు.
ఏమైనా ప్రజలు చాలా విజ్ఞతతో గొప్ప తీర్పు యిచ్చారు. హరీష్ రావుని గొప్ప మెజారిటితో గెలిపిచారు. కె.సి.ఆర్.ని ఓడిస్తామని భయపెట్టి గట్టెక్కించారు, రోజాని అసెంబ్లీకి రాకుండా చేసారు. ప్రరాపాని భంగపరిచారు. అల్లు అరవింద్ ఘోర పరాజయం మాత్రం నాకు పట్టలేనంత సంతోషం కలిగించింది - రాజనాల లాగా వికటాట్టహాసాలు చేయించింది. ఎంతైనా ప్రజల విజ్ఞతముందు మన అహంకారాలు, ఆ గుడ్డితనంతో మనం రచించే భవిష్యత్ చిత్రపటాలు నిలబడతాయా?
Tuesday, April 14, 2009
డార్క్ రూమ్ కలలూ, లైట్ రూమ్ 2.2
రంగంలో వున్న వెలుగు, నీడ, రంగులని పట్టి సరైన ఎక్సపోజర్ ఏమిటో నిర్ణయించడం ఒకప్పుడు చాలా జటిలమైన విషయం. దానిగురించి ‘జోన్ సిస్టమ్’ ఒకటి రూపొందింది. ఏన్సిల్ ఆడమ్స్ (Ansel Adams) నుంచి వందల మంది గొప్ప ఫొటొగ్రాఫర్లు - ముఖ్యంగా లాండ్ స్కేప్ ఫోటోగ్రాఫర్లు – వేల కొలది వ్యాసాలు ఆ విషయం మీద రాసారు. సాంకేతికంగా అనితరసాధ్యమైన ఫోటలు తీసిన ఏన్సిల్ ఆడమ్స్, స్పాట్ మీటర్ ఉపయోగించి రంగంలో పలు చోట్ల, వెలుగు, నీడ లని మీటర్ చేసి, దాని సగటుని లెక్కగట్టి, ఫొటో తీసేటప్పుడు వెలుగు సరిగ్గ రికార్డయ్యేలంటి ఎక్సపోజర్ ని కెమెరాలో పెట్టి, నెగెటివ్ డార్క్ రూమ్ లో డవలప్ చేసేటప్పుడు నీడలు సరిగ్గ వచ్చేలాగా డవలప్ చేసేలాగా సమయాన్ని పెంచి, దాన్ని ప్రింట్ చేసేప్పుడు కొన్ని ప్రదేశాల్లో మాత్రమే మాడ్చడం (Burn) లేద దాచడం (Dodge) లాంటి గమ్మత్తులు వుపయోగించి అద్భుతమైన ప్రింట్లు తయారు చేసాడు.
ఇమొజిన్ కన్నింఘమ్ (Imogen Cunningham) ఒక పోట్రయిట్ ఫోటో ప్రింట్ కి రాసుకున్న నోట్సు చూస్తే, బాంబు తయారుచేసే ఫార్ములా నోట్సు అంత క్లిష్టంగా కనిపిస్తుంది. ఆ నోట్సులో ఆమె, యిక్కడ యిన్ని సెకన్లు మాడ్చాలి, యిక్కడ యింత సేపు దాచాలి, దానికి వాడవలసిన రూపం యిది, అంటూ అతిచిన్న వివరంకూడా రాసారు. అద్భుతంగా కనపడే ఆ ఫోటోలు అలా రావడానికి ఫోటోగ్రాఫరు ఎన్నిగంటలు డార్కరూమ్ లో శ్రమపడాల్సి వచ్చేది ఆ నోట్స చూస్తే తెలుస్తుంది. సొంతంగా డెవలపింగ్, ప్రింటింగ్ చేసే ఫోటోగ్రాఫర్లకి ప్రక్రియలో అన్ని చోట్లా నియంత్రణ వుండేది. కలర్ ట్రాన్పరన్సీలు, నెగెటివ్ లు వచ్చాకా, డెవలప్ చేయడం, ప్రింట్ చేయడం చాలా సంక్లిష్టమవడమేకాక, దానికి కావలసిన పరికరాలు ఖరీదయినవి కావడంతో ఔత్సాహికంగా ఫోటోలో తీసే వాళ్ళు సొంతంగా డార్కరూమ్ వుంచుకోగలిగే అవకాశం తగ్గిపోయింది. కొంతమంది వృత్తి ఫోటోగ్రాఫర్లకి, ఔత్సాహికులకి ఒతనుగా ప్రింట్ చేసే స్టూడియోల వల్ల కొంత వరకు నియత్రణ / ప్రమేయం మిగిలినా చాలామందికి చివరిగా వచ్చే ఫలితం (ప్రింట్)లో నియంత్రణ తగ్గిపోయింది. డిజిటల్ వల్ల మళ్ళీ ఔత్సాహికులకి మంచిరోజులు వచ్చాయి.
వృత్తి ఫోటోగ్రాఫర్లు అనుసరించే డిజిటల్ పనివిధానం, ఫోటోలు తీసేప్పుడు ‘RAW’ ఫార్మేట్ లో తీసి, తరవాత డిజిటల్ డార్క్ రూమ్ లో ఆ నెగెటివ్ ని (RAW ఫోటోని) డెవలప్ చేసి, ప్రింట్ చేయడానికి అనువుగా చేయడం. యిలా చేయడం వల్ల చాలా లాభాలు వున్నాయి, పూర్వం ఫొటోగ్రాఫర్లకి డార్కరూమ్ లో ఏమేమి చేయడానికి అవకాశం వుండేదో అవన్నీ యిప్పుడు డిజిటల్ డార్కరూమ్ లో చేయగల ఆస్కారం వుంది. ఉదాహారణకి పోట్రయిట్ ఫోటోగ్రాఫర్లు తరచు చేసేపని, ఫోటోలో క్లారిటీని కొంత తగ్గించడం. దానివల్ల మొటిమలు, కళ్ళ చుట్టు వుండే చారలు లాంటివి దాదాపు అదృశ్యం అయిపోతాయి, అంతకంటే ముఖ్యంగా పలురకాల లైట్ సోర్స్ నుంచి వచ్చే వెలుగు వల్ల ఫోటోలో కనిపించే అసహజమైన రంగులని సరిచేయడం, లైట్ రూమ్ లాంటి డిజిటల్ డార్కరూమ్ లో చేయడం చాలా సులభం. క్రిందటి వారం, లైట్ రూమ్ లో డవలప్ చేసిన ఒక ఫోటో, పాత టపాలో వుంది, ఆసక్తి వుంటే తిరగేయచ్చు. డెవలప్ చేసిన సెట్టింగ్స్ కూడా అందులో వున్నాయి.