Friday, August 15, 2008

వరంగల్‌ యాత్ర


ఈమారు సెలవలకి ఇండియా వెళ్ళినప్పుడు ఖచ్చితంగ ఒక రెండు ప్రాంతాలు చూడాలనుకున్నాను. అందులో ఒకటి మెదక్‌ జిల్లా సిద్దిపేట - కె.సి.ఆర్‌. సొంత ఊళ్ళో ఆయన మీద నిజంగా ఎంత అభిమానం ఉందో చూడ్డానికీ, ఇంకోటి వరంగల్‌లో కాకతీయుల కీర్తితోరణాలు. సిద్దిపేట వెళ్ళడం కుదర్లేదు కానీ, ఎలక్షన్‌ ఫలితాలు చూసాకా ఆయన నియోజకవర్గం ప్రజలు యిచ్చిన తీర్పు స్పష్టంగానే వాళ్ళు ఏమనుకుంటున్నారో చెప్పింది. వరంగల్‌ ప్రయాణం మాత్రం చేయగలిగాను.

మే 30 శనివారం తెల్లారి 5 గంటలకి బయలుదేరడానికని డ్రైవర్‌ని మాట్లాడుకున్నాం. 'ఐదుగంటలకి రాగలవాయ్యా' అంటే అతను 'ఓ పావుగంట ముందే వచ్చేస్తాను సార్‌' అన్నాడు. ఫోటోలు తీయడానికి మధ్యాహ్నం ఎండ పనికిరాదు. పొద్దున్న, సాయంత్రాలు ఏటవాలుగా సూర్యకిరణాలు పడే ఎండలోనే ఫోటోలు బాగుంటాయి. ఐదు గంటలకి బయలుదేరి 8 గంటలకైనా చేరితే, పొద్దన్న వేయిస్తంభాలగుడి చూసుకుని, సాయంత్రం కోట దగ్గర వుండాలనీ మధ్యలో వీలయితే రామప్పగుడికి వెళ్ళి వద్దామని అనుకున్నాం. ఐదు గంటలకి వస్తానన్న డ్రైవరు ఏడింటికికాని రాలేదు. వేయిస్తంభాల గుడి చేరేప్పటికే 11 అయింది.

గుడి చాలా అంద్భుతంగా వుంది, కానీ, నే ఊహించింది వేరే (వర్షం సినిమా చూడలేదు లెండి, తెలుగు సినిమాలంటే కొంచెం భయం) వేయిస్తంభాలంటే చాలా పెద్ద నిర్మాణం అయివుంటుందనుకున్నా. బయట కనిపించే గోడలోనే స్తంభాలని లెక్కపెట్టాలని చెప్పారు. గుడిలోపల శివుడు, విష్ణువు, సూర్యదేవుడు మూర్తులు వున్నాయి. ఈరోజుకి గుళ్ళో దీప ధూప నైవేద్యాలు, పూజలు జరుగుతూనే వున్నాయి. శనివారం మిట్టమధ్యాహ్నం పూట కూడ మనుషులు లేకుండా వుండేలా ఫోటో తీయడం సాధ్యంకాలేదు - అంత జనం.

గుడి లోపల నాలుగు పెద్ద నల్ల గ్రానైట్‌(?) స్తంభాలు వున్నాయి. వాటిమీద చాలా అందమైన నగషీలు చెక్కారు. గుడి కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో, ఎంతమంది పనిచేసారోలాంటి రికార్డులు లేవుకాని, బహుశా కొన్ని వందల మంది సంవత్సరాల కష్టం అయివుండచ్చు. అది కట్టినవాళ్ళు, యిన్ని వందల సంవత్సరాల తరువాత కూడ ప్రజలు వీటిని చూసి ఆనందిస్తారని ఊహించి వుంటారోలేదో కానీ, వాళ్ళ శ్రద్ధ, సౌందర్య దృష్టి గుడిలో మనకి అడుగడుగునా కనపడతాయి.

ఎక్కడైనా తెలుగు శిలాశాసనాలు కనిపిస్తాయా అనిచూస్తుంటే యిది కనబడింది. ఏవో నాలుగైదు అక్షరాలు తప్పించి మిగతావి ఏమిటనే తెలియడం లేదు. అప్పటికే తెలుగు, కన్నడ భాషాల లిపి విడిపోయి వుండాలి, అయినా ఈ లిపి ఆధునిక తెలుగు లిపికి పోలికే లేదు. మీకు గడచిని శతాబ్దాల్లో తెలుగు లిపి పరిణామం గురించి ఆశక్తి వుంటే, వివరాలు యిక్కడ చూడగలరు.


గుడినించి దుర్గానికి పెద్ద దూరంలేదు - పదికిలో మీటర్లని జ్ఞాపకం.


ఊరునిండా దారి సూచించే బోర్డులు వున్నాయి. కొత్తవాళ్ళు వెళ్ళినా దారి కనుక్కోడానికి ఏమీ యిబ్బంది పడక్కర్లేదు. కోట ద్వారంలోప ప్రవేశించిన తరువాత రోడ్డు పాముమెలికలు తిరుగుతుంది. లోపల అన్నీ ప్రజలు నివాసంవుంటున్న యిళ్ళు. మధ్యలో కొన్ని చోట్లు పిల్లలు క్రికెట్టు ఆడుకునే చోట్లుగా వాడుతున్నారు.




నాలుగువైపులా గర్వంగ నిలుచున్న కీర్తి తోరణాలు తప్ప మిగతావన్ని నేలమీదే వున్నాయి. నేలమీద వున్న స్తంభాల శకలాల్లో చాలా అద్భుతమైన శిల్ప ప్రావీణ్యత కనబడుతుంది. కొన్నిటి మీద యుద్ధానికి వెళుతున్న సేనని చెక్కారు - ఏనుగులు, కాల్బలం వాటిమీద చూడొచ్చు. ఇంకొన్ని స్తంభాలమీద నర్తకులు యిలా. వాటిని పరిశీలించడం వాల్ల ఆనాటి సాంఘిక జీవనం తాలుకు కొన్ని చిహ్నాలని తెలుసుకోవచ్చు. అయితే మనకి మన గతవైభవ చిహ్నాల పట్ల వున్న ఉదాశీనత వల్ల, దీన్ని ఒక పార్కులాగా పరిగణిస్తున్నాం. బంతి ఆట ఆడడం, పిల్లల్ని అక్కడ వున్న ఏనుగుల శిల్పాల నీద కూర్చోపెట్టడం, అక్కడే తినడం, వుమ్మడం, యిది మన జాతి సంపదమీద మన వైఖరి.





అంతకన్నా హాస్యాస్పదమైన విషయం, నాతో వచ్చిన మా మామయ్య అక్కడ పనిచేసే ఏ.ఎస్‌.ఐ అధికారిని టాయిలెట్స్‌ ఎక్కడ వున్నాయని అడిగితే, అతను కొంచెం దూరంలో వున్న వాటిని చూపించి 'ఒకటికే ఐతే, అంతదూరం వెళ్ళక్కర్లేదు లెండి' అన్నాడు. ఒక బాధ్యత గల అధికారి అలా అన్నప్పుడు, ఇంకా ఏనుగుల మీద పిల్లల్ని కూర్చో పెట్టె తల్లితండ్రుల మీద కోపం తెచ్చుకుంటే ఏం ప్రయోజనం?





కొంచెం డబ్బులు, ఉత్సాహం వున్న సంస్థ చేతికి కోటని నిర్వహించే అధికారం యిచ్చి, సాధ్యం అయినంత వరకు బాగుజేసి, ఆ కాలపు దుస్తులు తొడుక్కున్న కొంత మంది వాలంటీర్లని రోజు కొంచెం సేపు కోటలో వుండేట్టు చేసి, వాళ్ళ చేత చిన్న చిన్న ఉపన్యాసాలు యిప్పించడం, లేద అప్పటి తెలుగు కవిత్వం చదివించడం చేస్తే ఎలావుంటుంది చెప్పండి? అప్పుడు వరంగల్‌ కోటని దర్శించడం మన జాతి చరిత్రని తెలుసుకోవడంలో ఒక పాఠంలా వుండదూ?






రామప్పగుడి కోటనుంచి డభ్భైకిలోమిటర్లదూరంలో వుంది.


దాదాపు 40 కిలోమీటర్ల వరకు ప్రయాణం హైవేమీదే. మిగతాదాంత మట్టి రోడ్డు. గుడి ఏజన్సీ ఏరియాలో వుంది. దారిలొ ఒకటి రెండు పోలీసు చెక్‌ పాయింట్స్‌ వున్నాయి. దారిలో మనకి గ్రామీణ భారతం కొంత తళుక్కుమని కనిపిస్తుంది - గడ్డిమోపులు మోసుకుని వెళ్తున్న ఎడ్లబండ్లు, మ్యూజియంలలోంచి తెచ్చారా అనిపించేలాంటి సైకిళ్ళు తొక్కుతూ కనిపించే బక్కచిక్కిన మనుషులు, చెట్లకింద కూర్చుని చుట్టలు కాల్చుకుంటూ కనబడే వాళ్ళు, యిళ్ళ బయట అంట్లుతోముకునే ఆడవాళ్ళు, నులక మంచాల మీద కూర్చున్న ముసలాళ్ళు, వాటి చుట్టు పరిగెత్తే కోళ్ళు.. ఆహ్లాదంగా అనిపిస్తాయి - ముఖ్యంగా మనం ప్రయాణం చేస్తున్న కారు మనది కానప్పుడు.

ఈ గుళ్ళో చాలా అద్భుతమైన శిల్పాలు వున్నాయి. రామప్ప అనే శిల్పి దీన్ని కట్టాడని ప్రశస్తి. నల్ల రాయి మీద చెక్కిన రంభ, నాగిని శిల్పాలు చాలా హృద్యంగా వుంటాయి. వేసవి కాలం సాయంత్రం నాలుగు ప్రాంతాలకి యిక్కడ ఎండ కొంచెం ఏటవాలుగా మారుతుంది, ఆసమయం ఫోటోలో తీయడానికి అనువైన కాలం. నేను ట్రైపాడ్‌ తీసుకెళ్ళలేదు కానీ, యిక్కడ ట్రైపడ్‌ వాడడానికి కానీ, ఫ్లాష్‌ వాడడానికి కాని ఎవరు అభ్యంతరం పెట్టెవాళ్ళు లేరు. సమయం లేక వెనక్కి వచ్చేసాం. ఈ సారి వెళ్ళినప్పుడు కనీసం ఒక రాత్రి అక్కడే వుండేలా ఏర్పాటు చేసుకుని వెళ్ళాలి.




***

3 comments:

  1. rajamundry ante aa chuttupakkala anna maata.
    nenu musium okasari chusanu
    art gallery inthavaraku chudaledhu
    kaani papikondalu tour gurinchi rayalani vundhi.

    ReplyDelete
  2. ఛాలా బాగా రాశారు. బొమ్మలuు కూడాభాగున్నై. ఈచిన్నచి న్న బొమ్మలు కాదు, దయచేసి పికాసాలో పూర్తి రిసొల్యూషన్‌ ఉన్న బొమ్మలు ఉంచమని ప్రార్ధన.
    వేయి స్తంభాల గుడిలో ఇప్పుడూ నిలిచి ఉన్నవి సుమారొక వంద రెండొందల స్తంభాలే. మిగతాదంతా శిధిలమైపోయింది అంటారు. 1960 లనాటికి ఈ ప్రాంగణంలో పిచ్చి కుక్కలు తిరుగుతూ, చుట్టుపక్కల ప్రజలుగొడ్లు కట్టేసుకుంటూ ఉండేది. ఆర్యీసీలో ఉద్యోగానికి వచ్చిన ్శైవమతానికి చెందిన కోందరు ప్రొఫెసర్లు ఈ గుడి గురించి తెలుసుకుని, తమ స్వంత ఖర్చు మీద ఒక అర్చకుణ్ణి ఏర్పాటు చేసి నిత్య దీప నైవేద్యాలకి ఏర్పాటు చేశారు. తరవాత, వారి ప్రయత్నమో , మరెలాగనో, ఆర్కియాలజీ వారు దీన్ని స్వాధీనం చేసుకుని బాగోగులు చూస్తున్నారు.
    కోట చూసి చాలా ఏళ్ళైంది గుర్తు లేదు.
    రామప్ప గుడి స్తంభాల మీద శిల్పం అద్భుతం.

    ReplyDelete
  3. కొత్తపాళీగారూ, థాంక్స. చాలా వే.సా.గు. గురించి ఆసక్తికరమైన సమాచారం చెప్పారు. నేనింకా వెయ్యి అందులోనే వెతకాలనుకున్నాను.

    ReplyDelete